Monday, December 31, 2007

ఉమెన్

ఈ ప్రపంచంలో మనం మన జీవితంలో ఎన్నో రకాలుగా స్ఫూర్తి పొందుతాం. ప్రక్రుతి నుండి, పక్షుల నుండి, జంతువుల నుండి, ముఖ్యంగా గొప్ప వ్యక్తుల జీవితాల నుండి, అలా కలిగిన స్ఫూర్తి మన జీవితాలనే మార్చేస్తుంది. ఏదో సాధించాలనే తపన పెరుగుతుంది. జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. నిజానికి మనం అలా ఆనందంగా, ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేకత కలగాలంటే ఖచ్ఛితంగా స్ఫూర్తి కలిగే విషయాలను గమనిస్తూండాలి. అలా నేను గమనించిన, నాకు స్ఫూర్తి కలిగించిన ఒక పుస్తకం డా.కెవిఎస్ మురళీ క్రిష్ణ గారు రాసిన "ఉమెన్ - హు ఇన్స్పైర్డ్ ది వరల్డ్". ఇందులో ఆయన ప్రపంచంలోని వివిధ రంగాలలో విజయం సాధించి, వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని, ఈ ప్రపంచానికే స్ఫూర్తిని కలిగించే ఎంతో మంది స్త్రీల గురించి తనదైన చక్కని శైలిలో వివరించారు, ప్రపంచ వ్యాప్తంగా ఎందరి నుంచో మంచి మార్కులు కొట్టేసారు. ఇది మహిళల గురించే అయినా అందరూ తప్పక చదవాల్సిన, అందరి డెస్కులో దాచుకోవాల్సిన పుస్తకం మీ కోసం ...

గడచిన కొన్ని శతాబ్దాలుగా, స్త్రీలకు ఎటువంటి హక్కులూ లేవు, చివరికి ఓటు హక్కు కూడా. ప్రపంచంలో మూడొంతుల పని స్త్రీల ద్వారానే జరుగుతుంది కాని వారికి ప్రపంచ సంపదలో ఏడు శాతం కూడా లభించదు. దేవుడు స్త్రీ, పురుషులను సమానంగానే తయారు చేసాడు. కానీ, చాలా మంది స్త్రీలకు తమను తాము నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కూడా కలుగదు. కొంత మంది స్త్రీలు వారి పనుల ద్వారా వారిలో కాంతిని ప్రకాశింపజేస్తారు అంటే కాంతి అంత అద్భుతంగా పనులు చేస్తారు కాని వారు ప్రసరించిన కాంతి వెలుగులోకి రాదు, వెలుగునివ్వదు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. వారిప్పుడు అలా లేరు. అన్నింటిలోని ముందే వున్నారు, డ్రైవరు సీటును ఆక్రమించారు. అన్ని రంగాల్లో అంటే తత్వవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా,గణిత, సాహిత్య, సాంఘిక,రచన, రాజకీయ, చిత్రలేఖన, సంగీత,కళలు, ఇలా అన్ని రంగాల్లోను ముందుకు దూసుకుపోతున్నారు, ముందు వరుసలో ఉంటున్నారు. ఈ పుస్తకంలో మనం అటువంటి పాత్రలను తమ నిజ జీవితంలో పోషించిన ఎంతో మంది స్త్రీలను చూడగలము. కాని, కొంతమంది అల్ప మానవులు మాత్రం స్త్రీలు దయ, ఓర్పు, సహనం, బాధను భరించే, పతులకు సేవ చేసే, పిల్లలను పెంచే కొన్ని క్వాలిఫికేషనుల కోసమే చదువుతున్నారంటూ, వారిని, వారి చదువుని కూడా అంటూంటారు, ఇంకా ఈ సమాజంలో స్త్రీ పాత్ర ఏమీ లేదు, వారు ఏమీ కాలేరు అంటూ అనడమే కానీ, అలా అంటూ వారేం కోల్పోతున్నారో అర్థం చే సుకోరు.

కనుక, ఇక్కడ పురుష జాతి స్వభావాన్ని మార్చుకోవడమనేది ముఖ్యం కాదు కానీ స్త్రీల పట్ల అనుకూల భావనను కలిగి వుండాలి, వారిలో దాగి ఉన్న ప్రతిభను ఒప్పుకోవాలి. 19వ శతాబ్దంలో, స్త్రీలకు ఎటువంటి అవకాశం ఇవ్వబడలేదు, ఎంతో నీచంగా చూడబడేవారు. కానీ, 21వ శతాబ్దంలో, స్త్రీ పాత్రలో ఎంతో పెరుగుదల, వారు నెమ్మదిగా, నిదానంగా ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా ఈ సమాజంలో వారికంటూ ప్రత్యేక స్థనాన్ని ఏర్పరచుకున్నారు. అలా స్థానాన్ని, విజయాన్ని దక్కించుకున్న కొంత మంది స్త్రీల జీవితాలు నిజంగా ఒక్కరినీ, ఇద్దరినీ కాదు, ఈ మొత్తం ప్రపంచానికే ఆదర్శవంతం, స్ఫూర్తిదాయకం. కొత్త ఆలోచనలను, జీవిత సరళిని మార్చారు కొంత మంది స్త్రీలు, మరి కొంత మంది తత్వవేత్తలు, తిరుగుబాటుదారులుగా, ఇంకొందరు శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, నాయకులు, పాలకులు, ధైర్య, ధీరశాలురుగా, ఇంకొందరు క్రీడల్లో, రచనల్లో ప్రతిభను చూపితే, మరికొందరు కళలలో,నటనలో, అందంలో కూడా తమ ప్రతిభను చాటుకున్నారు. వారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఎంతో చక్కగా ఆలోచించి, జీవన సరళిని మార్చుకుని, తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేలా చేసిన యశోధర, సిద్ధార్థుడి భార్య. ఒక కొడుకు పుట్టిన తరువాత సిద్ధార్థుడు తన కుటుంబాన్ని వదిలి బుద్ధుడిగా మారితే, యశోధర తన కొడుకుని చక్కగా పెంచి, మంచి బుద్ధులు చెప్పి, తరువాత ఆమె కూడా సన్యాసం తీసుకుని, బౌద్ధ మతంలో మొట్టమొదటి సన్యాసినిగా చరిత్రలో నిలిచింది. ఆమె ఎప్పుడూ తన కొడుకు రాహులాకు "ప్రపంచంలో అందరూ మరో జన్మ వద్దనుకుంటే, సుర్యచంద్రులతో సహా, అప్పుడు ఈ ప్రపంచం ఏమవుద్ది? అందుకే సుర్యచంద్రుల్లాగే ఎప్పుడూ జీవిద్దాం, ప్రపంచానికి 365 రోజులు, 24 గంటలు వెలుగునిద్దాం, అలా జన్మిస్తూనే ఉండాలి," అని చెప్పేది. యశోధర తత్వాన్ని మైథిలి శరన్ గుప్త్ రాసిన చాల పుస్తకాల్లో తెలుసుకోవచ్చు.

తరువాత, ఆండర్సన్ ఇ గారెట్, మొట్టమొదటిగా వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన గొప్ప మహిళ. ఆమె స్త్రీల హక్కుల కోసం కూడా పోరాడి గెలిచింది. ఆన్నిబీసెంట్, భారతీయ సంస్క్రుతీ, ఆచారాలు,తత్వానికి ఆకర్షితురాలై భారతీయురాలిగా మారిపోయింది. ఎన్నో ఉద్యమాల్లో పాల్గుంది. ఆమె ప్రత్యేకంగా హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి చరిత్రలోనే తను ఒక పుట సంపాదించుకుంది. మనకందరికీ తెలుసు కిరణ్ బేడీ,భారత ఉక్కు మహిళ, మన దేశంలో మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్. నిజానికి తాను ఐఏఎస్ కావాలనుకుంది కానీ దాంట్లో ఎంపిక అవకుండా ఐపిఎస్కు ఎంపికైంది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె ఈ వ్రుత్తిని ఒక సవాల్గా తీసుకుంది, మంచి పేరు సాధించింది. ఆమె ఎన్నో అద్భుతమైన రచనలు కూడా చేసింది. "నవ జ్యోతి" అనే పేరుతో సాంఘిక సంస్థను స్థాపించింది. ఆమె విజయానికి గల కారణం మనకున్న భయాలను వదిలేస్తే మనం సాధించనిదంటూ ఏమీ లేదనే సిద్దాంతంపై ఆమెకున్న నమ్మకమే. నిజమే కదా. ఇక, ఇప్పుడు మహిళలందరూ తమకున్న ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాని వారికా హక్కు ఎలా వచ్చిందో తెలియదు. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. 1914వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మిసెస్ ఎమిలైన్ పాంకరస్ట్, ఆమె కూతురు క్రిస్టాబెల్లు ఈ మహిళా ఓటు హక్కు కోసం ఎంతో శ్రమ పడి, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి స్త్రీలు ఏ పనైనా చేయగలరని నిరూపించి, 1918లో 30 సంవత్సరాలు పై బడిన స్త్రీలకు ఓటు హక్కును సాధించారు. 1928లో మాత్రమే, దానిని 21 సంవత్సరాలకు తగ్గించారు. మరి వీరి గురించి మనం తెలుసుకోవాలి కదా.

ఇక మనందరికీ తెలిసిన గొప్ప స్త్రీ హెలెన్ కెల్లెర్. ఆమె పూర్తిగా గుడ్డిది, చెవిటిది అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా, బ్రైయిలీ లిపిలో చదవడం, రాయడం నేర్చుకుని, కేంబ్రిడ్జ్లో, ఇంగ్లీష్లో గ్రాడ్యేషన్ పూర్తి చేసి తెలివైన విద్యార్థిగా నిరూపించుకుంది. ఇంకా ఎన్నో రచనలు కూడా చేసింది. మనకు ఎన్నో లోపాలను కలిగించినా వాటికి ఒక కారణం ఉంటుంది అంతేకాక దాని బదులుగా ఆ దేవుడు మనకు ఖచ్ఛితంగా మరో ఉన్నత, ఉత్తమ లక్షణాన్ని ఇస్తాడు. జీవించడమంటే ఇవ్వడమని ఆమెకు తెలుసు. మనం ఏవి సంపాదించినా, అది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. మనతో వుండదు. మనం సమాజానికి ఏదైతే ఇస్తామో అదే శాశ్వతం, అదే మనకు జీవితానిస్తుంది. అది ఎంత చిన్నదైనా, తక్కువైనా అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది. కనుక, మంచిగా వుంటూ, సమాజానికి ఎంతోకొంత సేవ చేద్దాం. మనం మన జీవితం గురించి, సమాజం గురించి ఆలోచించాలి, మన జీవితంలో ఎన్నో ఇచ్చిన ఆ దేవునికి క్రుతజ్ఞత చెప్పాలి., చివరికి మనం చేసిన దానం మనలో నవ్వుల్ని పూయిస్తుంది. అస్తమించే సూర్యుడు,"ఇప్పుడు నా పనెవరు చేస్తా," రని అడిగితే, చిన్న కొవ్వొత్తి వెలుగు,"నాకు సాధ్యమయ్యేంత వరకూ నేను చేస్తాన"ని చెప్తుంది. మనం కూడా ఆ కొవ్వొత్తిలా జీవిద్దాం.

ఇక శాస్త్రజ్ఞుల విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది మేడం క్యూరి. మానవుల్లో, అది, స్త్రీ ఐనా, పురుషులైనా, ప్రపంచంలోనే నోబెల్ బహుమతిని రెండు సార్లు అందుకున్న గొప్ప మహిళ. ఆ రోజుల్లో ఒక స్త్రీ సైన్స్ రంగంలో వుండడమనేది ఊహాతీతం. కానీ,సైన్స్ పరిశోధనలో ఆమెకున్న ఆసక్తే ఆమె విజయనికి దోహదపడింది. ఆమె పెళ్ళి తరువాత కూడా, తన భర్త, తాను కలిసి రేడియో ధార్మిక మూలకాలను కనిపెట్టారు. అది కాన్సర్ నిర్మూలనకు ఉపయోగపడింది. అందుకే ఆమె నోబెల్ బహుమతిని సాధించింది. రోజుకు 18 గంటలు పని చేసి, 8 సంవత్సరాల తరువాత కెమిస్ట్రీలో పరిశోధనకుగాను ఆమెకు రెండవ సారి నోబెల్ను ప్రధానం చేసారు. మిసెస్ మేరీ లావోయిసెర్, ఆధునిక కెమిస్ట్రీకి పితామహుడైన లావోయిసెర్ భార్య నిజంగా ఒక స్త్రీగా, ఒక భార్యగా ఎప్పుడూ ఆమె భర్తను ప్రోత్సహిస్తూ, అతని మరణం తరువాత కూడా అతను రాసిన రచనలను పుస్తకాలుగా ప్రచురించి, పబ్లిష్ అయ్యేలా చేసింది. ఆ శాస్త్రవేత్త గొప్పతనాన్ని ప్రపంచమంతటికీ చాటింది. ఎప్పటికీ అతనే గొప్ప ఫ్రెంచ్ శాస్త్రవేత్తగా కొనియాడబడ్డాడు. ఇప్పుడు స్త్రీలు భార్యలుగా ఎంతవరకూ తమ భర్తల జీవితం, పిల్లల జీవితం గురించి ఆలోచిస్తూ, తమకి తాము ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు? ఏదో ఒకటే చేస్తున్నారు. వారిని వారు నిరూపించుకోవటంలేదు. మేరీ లావోయీసెర్లా క్రుషి చేస్తే వారి జీవితం కూడా వెలుగులోకి వస్తుంది. వారికీ ఒక ప్రత్యేక పేజి కేటాయించబడుతుంది. ఎందుకంటే ప్రతీ మగవారు వారు చేసిన పనిని ఒక నిచ్చెన ఎక్కినట్టుగా భావిస్తే, వారు కిందికి చూస్తే కింద ఒక వ్యక్తిని చూడగలరు, ఆ వ్యక్తే "భార్య".అందుకే ప్రతీ పురుషుని విజయం వెనుకా ఒక స్త్రీ వుంటుందనే మహత్తర సత్యం లావోఇసర్స్ వల్లే వెలుగులోకి వచ్చింది. కనుక, ఏది చేసినా, ఏం జరిగినా అందులో స్త్రీ పాత్ర ఖచ్ఛితంగా వుంటుందనడానికి వెనుకాడాల్సిన పని లేదు.

తరువాత చెప్పుకోవాల్సిన వారు శకుంతలాదేవీ, గణిత ప్రావీణ్యురాలు. ఆమెను నవ కంప్యూటెర్గా వరిగణించారు. గణిత శాస్త్రంలో ఆమెకున్న పట్టు ఆమెకు గిన్నీస్ బుక్లో స్థానమిచ్చింది. ఇక సాంఘిక సంస్కరణల విషయంలో, ఫ్లోరెన్స్ నైటేంగిల్ సమాజానికి చేసిన సేవ చెప్పుకోదగింది. ఆధునిక నర్సింగ్ని స్థాపించిన ఫ్లోరెన్స్ నర్సింగ్పరంగా ఎంతో సేవ చేసింది. ఆమె తన అవసరాలను, సౌకర్యాలను త్యాగం చేసి, కేవలం అనారోగ్యంతో భాదపడే వారికి సేవ చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసింది. రాత్రి వేళల కూడా ఆమె దీపాన్ని పట్టుకుని రోగులకు చికిత్స చేసేందుకై వెళ్ళేది. అందుకే ఆమె "ది లేడీ విథ్ ది లాంప్" గా పేరు పొందింది. పేషెంట్లు ఆమె నీడను సైతం చూసి చలించిపోయేవారు, ఎంతో ఆప్యాయతతో చూసేవారు. తరువాత చెప్పుకోవాల్సిన వారు మనకందరికీ బాగా తెలుసు మదర్ థెరిస్సా. ఆమె సమాజానికి చేసిన సేవ చిరస్మరణీయం, ప్రతీ స్త్రీ ఒక మదర్ థెరిస్సా కావాలనుకునేంత స్ఫూర్తిని కలిగించారు. ఒక మంచి పనిని చేయడాన్ని వాయిదా వేయద్దు. జీవితం చాల చిన్నది, ఇప్పటికే ఆలస్యమైంది. లేద్దాం, కాలాన్ని ఉపయోగిద్దాం, విజయం మనదే. ఇక మనకందరికీ తెలుసు ప్రపంచ ధనవంతుల్లో మొదటి పది మందిలో ఒకరు, ఆసియా ఖండంలో పది మంది ప్రముఖుల్లో ఒకరు, "ఇన్‌ఫోసిస్" అధినేత ఎన్ ఆర్ నారాయణ మూర్తి గారు, ఆయన వెనుక ఒక స్త్రీ ఉన్నారు, ఆమె వారి భార్య సుధా మూర్తి. టాటా టెల్కొలో పని చేసిన మొట్టమొదటి మహిలా ఇంజినీర్. 1000 స్కూళ్ళకు, 4000 లైబ్రరీలు, అనేక మంది పిల్లలు, స్త్రీ విద్యా కార్యక్రమాలకు ముఖ్య పోషకురాలు ఆమె, మంచి రచయిత్రి కూడా. ఆమె రాసిన "గ్రాండ్మా కథలు" అందరూ చదవాల్సిన పుస్తకం.

గొప్ప దేశభక్తులు కూడా ఉన్నారు. అలా చూస్తే ఝాన్సీ రాణీ లక్ష్మీ భాయిని మించిన వారెవరూ లేరు. ఆమె చిన్నప్పుడే గుర్రపు స్వారీ, యుద్ధ కళలు నేర్చుకుంది. తన 8వ ఏట వివాహం చేసుకుని ఝాన్సికి రాణి అయింది. తన భర్త, కొడుకుల మరణం తరువాత బ్రిటీష్ వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే లక్ష్మీ భాయ్ వేరే పిల్లాడిని దత్తత చేసుకుని , తన దేశం కోసం పోరాడి, బిడ్డను తన వెనుకకు కట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళి, వారితో యుద్ధం చేసింది. ఆమె ధైర్యానికి బ్రిటీష్వారు ఆశ్చ్ర్యపడినా వెరే దారి లేక ఆమెను చంపితే గానీ రాజ్యం రాదు కనుక ఆమెను చుట్టు ముట్టారు. యుద్ధ భూమిలోనే ఆమె వీర మరణం చెందింది. తరువాత చెప్పుకోవల్సిన మహత్తర మనిషి, దేశ భక్తురాలు, రచయిత్రి, "భారత నైటింగేల్ " సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు. ఎన్నో పుస్తకాలను కూడా రచించారు. దేశభక్తితో దేశానికి మంచి చేయాలని, దేశానికే అధ్యక్షులయారు ఇందిరా గాంధి, ఎవరూ మర్చిపోని, ప్రతీ స్త్రీ ఆదర్శవంతంగా తీసుకోవల్సిన వ్యక్తి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎంతో మంది స్త్రీలు తమ దేశాలను పాలించారు. బెనజ్జీర్ బుట్టొ, క్వీన్ విక్టోరియా, సోనియా గాంది ఇలా అందరూ స్త్రీలే.

కల్పనా చావ్లా, పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దైర్యం. అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి మహిళ. కొన్ని రోజులు ఆమె అక్కడ ఉండి, ఎన్నో ఆపరేషన్లు నిర్వహించి అన్నింటా విజయం సాధించి స్త్రీలు ఏ విష్యంలోను తక్కువ కాదని, ఏ పనైనా చేయగలరని నిరూపించారు. కొంతమందికి మరణం ఉండదు. అలాగే కల్పనా చావ్లా కూడా. ఆమె భౌతికంగా మరణించినా, కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా అందరి హ్రుదయాల్లో, పుస్తకాల్లో ఆమెకు శాశ్వత జీవం, జీవితం ఉంటుంది. ఎందుకంటే మనకు గొప్ప లక్ష్యాలు సాధించాలన్న తపన ఉంటే, తప్పకుండా సాధిస్తాం. అలా సాధించినపుడు, సాధించేటప్పుడు మరణించినా, అది నిజమైన మరణం కాదు, నిజానికి అప్పుడే మన జీవితం ప్రారంభమౌతుంది! అదెలాగో మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. సునీతా విలియంస్, క్రిస్టినా డాడ్వెల్ ఇలా ఎందరో సాహస వనితలు మన దేశంలో, మన ప్రపంచంలో జన్మించారు. కొంతమంది వెలుగులోకి రాకపోయినా మన మధ్యనే ఉండి ఉంటారు, మనం వారిని వెలుగులోకి తెద్దాం, తేవడానికి ప్రయత్నిద్దాం.

అంతేకాక, క్రీడల్లోనూ స్త్రీలు వారి సత్తాను చాటుకున్నారు. జీవితాన్ని అనందమయం చేసుకున్నారు. వారిలో టెన్నిస్ క్రీడాకారిణి, క్రిస్ అవెర్ట్ సంపాదించిన పేరు ప్రఖ్యాతులు మరెవరు సాధించుండరేమో. ఆమె టెన్నిస్ నుండి రెటైర్ అవుతునప్పుడు 20,000 మంది పైగా అభిమానులు బాధపడ్డారు, కన్నీరు పెట్టుకునారు. ఎంత ఆశ్చర్యం? మనం ఆ విధంగా స్ఫూర్తి పొందాలంటే చాలా మంది క్రీడాకరులు ఉన్నరు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి విల్మా రుడాల్ఫ్. ఆమె పుట్టడమే 2 కేజీల కన్నా తక్కువ ఉంటూ, తరువాత కూడా అనేక సమస్యలతో బాధ పడింది. నిజంగా అలా ఎవరికీ జరగదేమో. తరువాత ఆమె ఎడమ కాలు పూర్తిగా నాశనమైంది. డాక్టర్లు ఇంకెన్నడూ ఆమె నడవలేదని తేల్చేశారు. ఆమె జీవితం ప్రతికూలాంశాలను సాధించిందని చెప్పొచ్చు. కానీ ఆమె అధైర్య పడకుండా ముందుగా జీవించాలనుకుంది. తన స్కూలు రోజుల్లోనే బాస్కెట్ బాల్ లో ప్రథమ స్థానం పొంది, తరువాత 16 సంవత్సరాల గ్రూప్లో ఒలింపిక్స్లో పాల్గొని, బ్రాంజ్ మెడల్ సాధించింది. విజయానికి ఎక్కడా అంతమనేదే లేదు, అది ముగింపు కాని గమ్య స్థానం. వివిధ అంశాల్లో మూడు బంగారు పతకాలను సాధించిన మొదటి అమెరికన్ స్త్రీ. ఆమె విజయానికి కారణం, ఆమె సాధించాలన్న కల. ఆమె ఆ కలను ఎప్పుడూ చెరగనివ్వలేదు. దాన్ని నిజం చేసేందుకు, తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో కష్ట పడింది. ఒక ఆశ , నడవలేని మనిషిని కూడా పర్వతాలను ఎక్కేలా చేస్తుంది. అలా ఇక్కడ మనం ఓ సాధారణ గౄహిణి గొప్ప అథ్లెటై ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డ్ సాధించి, ఆ శతాబ్దానికే ఉత్తమ మహిళా అథ్లెట్గా కీర్తించబడింది. మనం సహనాన్ని కోల్పోతే, అంతా కోల్పోతాం. ఓడిపోయేవాడు ఎప్పుడూ గెలవడు, గెలిచేవాడు ఎన్నడూ ఓడడు. ఇలా మనం మార్టినా నవ్రతిలోవా, పీ.టీ.ఉషా, సానియా మీర్జా ఎంతో మందిని చూడవచ్చు, స్ఫూర్తిని పొందవచ్చు.

తమ రచనల ద్వారా కూడా స్ఫూర్తిని నింపుతూ, తద్వారా ఆ రచనలు చేసిన వ్యక్తులనే స్ఫూర్తిగా తీసుకునేలా వుండే వ్యక్తులు అని ఫ్రాంక్, ఆమె రాసిన డైరి 19 భాషల్లో ప్రచురించబడి, రెండు మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి అంటే అది ఎంత ప్రభావితపరిచే రచనో. ఇల ఎంతో మంది స్త్రీలు వారి రచనలను మనకందించారు. జె.కె.రౌలింగ్- హ్యారి పాటర్, కమలా దాస్ - తన జీవిత చరిత్ర, "మై స్టోరీ" , మేధా పాట్కర్ - సాంఘిక, పర్యావరణాలపై చేసిన రచనలు, హిందూ వేదాంతం, హిందూ దేవతలపై, తోరూ దత్ చేసిన రచనలు నిజంగా అద్భుతం. లతా మంగేష్కర్, గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, ప్రపంచ గిన్నీస్ బుక్లో కూడా స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రతీ రోజూ ప్రపంచంలో ఎక్కడో ఓ చోట, ఏ మూలనో ప్రతీ సెకను, ప్రతీ నిముషం లేదా రోజంతా ఆమె గొంతుని పాటల రూపంలో వింటూనే ఉంటాం. ఎమ్మెస్ సుబ్బ లక్ష్మి గారి సంగీతం కూడా చాల మందిని ప్రభావితం చేయగలదు. ఏక్తా కపూర్, అమ్రితా షెర్గల్, ఇలా చాలా మంది తమ కళల్లో పేరు సంపాదించుకున్నారు. అందంలో, అందంతో కూడా డయాన,క్లియోపాత్ర, సమతా ఫాక్స్, ఎలిజిబెత్ టేలర్, హేమా మాలిని, నర్గిస్ దత్, మడోన్నాలు ప్రపంచ చరిత్రలో తమ మార్కును వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలైనా సరిపోవు. ఇంకా మనం రుక్మిణీ దేవీ అరుంధల్, గొప్ప థింకర్, సిరిమావొ బండారు నాయక- ప్రపంచ మొదటి మహ్ళా ప్రధాన మంత్రి, భారత దేశంలో మెరుగులు దిద్దుకున్న జయ లలిత, మేనకా గాంధి, ప్రియా టెండూల్కర్, ప్రియాంకా గాంధీ, మిథాలీ రాజ్, వసుంధరా రాజే వంటి గొప్ప స్త్రీలను చూడవచ్చు, వారిలా మనమూ కావచ్చు. ఇన్సులిన్ నుండి అనేక యాంటీ బయాంటిక్స్ను ఉత్పత్తి చేస్తూ, ఫార్మా రంగంలోనే 1000 కోట్ల టర్నోవర్ను చేస్తున్న కిరణ్ మజూందర్ షా, మొదట్లో డాన్స్ తప్పా ఏమీ నేర్చుకోక, ఇద్దరు పిల్లల తల్లయిన ప్రీతా రెడ్డి, ఇప్పుడు అపోలో గ్రూప్ హాస్పిటల్లకు నిర్వాహక కార్యదర్శి, షబానా ఆజ్మి- ప్రఖ్యాత సినీ తార, అరుంధతీ రాయ్, భరతీయ ఆంగ్ల రచయిత్రీ, బృందా కారత్, స్త్రీ ఉద్యమకారి అందరూ స్త్రీలే, స్ఫూర్తిమంతులే.

ఆ దేవుడు స్త్రీ జాతికిచ్చిన వరాలు రెండు. ఒకటి మాతృత్వం, రెండు అందం. కొన్ని ప్రతికూలాంశాలనూ ఇచ్చాడనుకోండి. వాటిని మనం ఈ పుస్తకం చివరి పేజీల్లో చూడవచ్చు. కానీ, వాటిని అనుకూలంగా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా స్త్రీ, పురుషులు ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. అందరూ సమనమే. మనది పురుష జాతీ కాదు, స్త్రీ జాతీ కాదు, అలా అని మానవ జాతీ కాదు.మనది జంతు జాతి. ఏదీ ఎక్కువా కాదు, ఏదీ తక్కువా కాదు. మనందరం ఈ సజీవ నిజాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలన్న మురళీ కృష్ణగారి మాటలతో నేను ఏకీభవిస్తాను. "ఉమెన్ " పుస్తకం చదివితే మీరూ ఏకీభవిస్తారు.