Friday, May 2, 2008

డార్క్నెస్ విజబుల్

విలియం గోల్డింగ్ ఆధ్యాత్మిక, నిరాశమయ, కల్పిత నవలా రచయిత. ఆయన రాసిన కథలు ఎంతో వినోదకరంగా, ఉత్కంఠభరితగా ఉంటాయి. చదవడానికి ఎక్కువ ప్రయత్నం చేయనక్కర్లేకుండా మనకు తెలియకుండానే చివరి వరకూ ఇష్టంగా చదివేలా ఉంటాయి. 20వ శతాబ్దపు సాహిత్యానికి మంచి కథలను నవలల రూపంలో అందించారు. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగింది "డార్క్నెస్విజబుల్". 1979లో పబ్లిషైన ఈ నవల 'జేమ్స్టైట్ బ్లాక్ మెమొరియల్ ప్రైజ్' ను గెలుచుకుంది. రెండో ప్రపంచ యుద్ధం గోల్డింగ్పై ఎటువంటి ప్రభావం చూపిందో తెలుస్తుంది. నిప్పుతో ప్రకాశింపజేయబడిన ఓ చీకటి పుస్తకమిది. ఈ ప్రపంచంలో దుర్మార్గానికున్న ఆధిక్యత, దాని ఆధిపత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నవలను రచించారు గోల్డింగ్. ఈ నవలా పరిచయం మీకోసం......

మంచికీ, చెడుకీ మధ్య జరిగిన పోరాటం నుండి భౌతికంగా తప్పించుకోవడానికి చేసిన స్వాభావికమైన సాధుత్వం, నిరంతర ప్రయత్నాలకు టెర్రరిజాన్ని కాస్త జోడించి ఆధునిక సంద్ర్భానుసారంగా ఈ కథను అల్లారు. డార్క్నెస్ విజబుల్ నైతికాంశాల్లో ఖచ్ఛితమైన తీర్పునివ్వడంలో ఉన్న కష్టాలను అన్వేషిస్తుంది. వ్యక్తుల పతాక స్థాయి ప్రవర్తన, విపరీతమైన సాధుత్వం, వాళ్ళకున్న శాపాలు, వాళ్ళు పడే బాధలు ఇలా వాళ్ళ అంతరాత్మల్లో జరుగుతున్న వివాదాలను భరించే సామర్థ్యం ఉన్న వారు రక్షింపబడతారా లేదా నశిస్తారా అన్న చివరి ఫలితాన్ని ఇది చూపిస్తుంది. మరో వైపు ఈ అధ్యాత్మిక ప్రపంచంలో మన చుట్టూ, మనకు చేరువలో ఉన్న కొన్ని రహస్యాలు ఎంతో మందికి కనిపిస్తాయి లేదా తెలియకుండానే దాటి వెళ్ళిపోతాయి. ఇలా ఆధ్యాత్మిక పరిణామాల్లో జీవిస్తూ వ్యతిరేక భావాలతో ఉన్న రెండు పాత్రలనుపయోగించి గోల్డింగ్ ఈ రహస్యాలను ప్రవేశపెట్టారు. ఆ పాత్రలే మ్యాటీ, సోఫీ.

మాటీ భౌతికంగా అందంగా లేకపోయినా తన ప్రపంచంలో నిస్వార్థ ప్రేమ, అంకిత భావాలతో ఒక సాధువులా జీవిస్తాడు. తనకి వ్యతిరేకంగా సోఫీ దుర్మార్గ శక్తులకు ప్రతినిధిగా ఉండే అందమైన యువతి, తన కౄర ప్రవర్తనతో, జీవితంపై సాధారణ దృక్పథంతో ప్రపంచ వినాశనానికీ, అవ్యక్త స్థితికీ ప్రేరణ కలిగేలా ఉంటుంది, అలానే ప్రేప్రేపిస్తుంది. అన్నింటినీ ఆ దేవుడే చూస్తాడన్న నమ్మకం మ్యాటీదైతే, అవకాశం కోసం ఎదురు చూస్తుంది సోఫీ.ఈ నవల రచన తీరు ఒక్కో పాత్రను సులభంగా అర్థం చేసుకునే రీతిలో ఉంటుంది. మ్యాటీ స్వచ్ఛమైన క్రీస్తు ప్రతిమగా వర్ణించబడ్డాడు. ఎందుకంటే ఈ నవలలో మ్యాటీ అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్న ఓ మంచి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే, ఎక్కడ నుండి వచ్చాడో అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన వాడో తెలియదు కానీ మంటల్లో నుండి అద్భుతంగా, అంతే ఆశ్చర్యంగా బయటకొస్తాడు. తన ఎడమ వైపు ముఖ భాగం పూర్తిగా కాలిపోయి మాట్లాడలేని స్థితిలో ఉన్న మ్యాటీని అక్కడున్న కొంత మంది వ్యక్తులు ఆసుపత్రిలో చేర్చి, మ్యాటీ ఎవరనేది తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో వారే తనకీ రెండు క్రీస్తు పేర్లు మాథ్యూ, సెప్టిమస్గా పెట్టి పిలుస్తారు. తరువాత, మ్యాటీగా గుర్తించబడిన తనని స్కూలుకి పంపించినా అక్కడున్న పిల్లలతో, టీచర్లతో సరిగ్గా మాట్లాడలేకపోవడం, తన అందవికార ఆకృతి వల్ల ఏ పనీ చేయలేక బాధపడ్డ మ్యాటీ, కొంత మంది విద్యార్థులు, పెడిగ్రీ అనే ఓ టీచర్ సహాయంతో కాస్త చురుగ్గా తయారవుతాడు. అయితే అంతలోనే తన సహచర విద్యార్థి హెండర్సన్ అనుమానస్పద స్థితిలో మరణించడం, తన అభిమాన టీచర్ పెడిగ్రీపై అనుమానంతో ఆయన్ని జైలుకు తీసుకెళ్ళే సమయంలో అదంతా మ్యాటీ తప్పేనని, తన వల్లే అంతా జరిగిందన్న ఆయన మాటలకు మ్యాటీ ఎంతో అపరాధ భావనతో బాధపడి, హెన్డర్సన్ వినాశనానికి ఆధ్యాత్మిక శక్తి ప్రభావముందా అని అర్థం కాని ఆ వయసులో ఆలోచిస్తూ అయోమయంలో ఏం జరిగిందో అక్కడ హెడ్ మాష్టర్కి స్పష్టంగా చెప్పలేక పోవడంతో తననా స్కూలు నుండి పంపించేయడం, ఆ తరువాత ఎక్కడికి వెళ్ళినా అతన్ని తీస్కరించడంతో మ్యాటీ ఓ సంచారిలా మారిపోతాడు.

తరువాత అసలీ ప్రపంచంలో ఏం ఉందో, అంతకన్నా ముందుగా తనను తాను తెలుసుకోవాలని వేరే దేశం వెళ్ళి ఎన్నో సాహస కార్యాలు చేస్తాడు. మ్యాటీ మంచితనానికి వ్యతిరేకంగా ఇద్దరు కవలలు సోఫీ, ఆంటోనియాలు తమ వయసుకు మించిన దుర్మార్గాలు చేస్తుంటారు. సోఫీ, టోనీలు సహజ దుర్మార్గాన్ని ముఖాలకు తొడుకున్నట్లుగా ఉంటారు. ఆ కవలలు భౌతిక అందం వారి అంతఃచీకటిని దాచితే, మ్యాటీ నిరాకారమైన ముఖమ్, శరీరం తనలో దాగియున్న మంచితనాన్ని తెలియకుండా చేశాయి. కొన్ని సౌమ్య శక్తులు మ్యాటీ, సోఫీలను వ్యతిరేక దిశల్లో అభివృద్ధి చేశాయి. మ్యాటీ తనకు తానుగా అధ్యాత్మికంగా, నిర్మాణాత్మకంగా మారితే, సోఫీ ఏ మాత్రం మంచి లేకుండా, తన దుర్మార్గ ఆలోచనల్ని ప్రజలు అంగీకరించేలా వారిని ప్రేరేపిస్తుంది. ఈ నవల రెండో భాగం చివర్లో ఒక పిల్లడిని కిడ్నాప్ చేసి, తనని హింసించి, చమ్పేయాలనుకున్న సోఫీ దుర్మార్గం బయటపడితే, మ్యాటీ మంచితనపు శక్తులతో ఆ పిల్లాడిని రక్షించి తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు. మంచి, చెడుల మార్గాలైన మ్యాటీ, సోఫీలు ఏ విధంగా ప్రభావితం చెందారో తెలుసుకోవచచు. మంచి, చెడుల మధ్య జరిగిన పోరాటంలో వాళ్ళు పడ్డ సంఘ్ర్షణను గమనించగలం.

ఇక మూడో భాగం, అధ్యాత్మిక ఏకాంత వాస స్థితిని చూపిస్తుంది. అడ్డులు, అడ్డుగోడలు మనుషులతోనే నిర్మించబడతాయి. వాటిని కూల్చేయాలి. ఇది మ్యాటీకి సాధ్యమేనని చెప్పారు. క్రీస్తు ప్రతిమ కనుక అంతరాల్లో ఉన్న రోదనను ఆపగల శక్తి మ్యాటీకున్న వరం. గొప్ప బలంతో మానవ దుర్మార్గం, వారు చేసే పాపాల కోసం విచారిస్తూ, ఇంకా మానవత్వం పై ప్రేమను చూపిసతూ నిశ్శబ్దంగా సంభాషంచగలడు. దానికి ఉదాహరణగా తన సహచరుడు హెండర్సన్ మరణం విషయంలో బంధించబడిన పెడిగ్రీ విడుదలయ్యాక మ్యాటీ అతన్ని కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడి తన గురుభక్తిని చూపించాడు. మ్యాటీని క్రీస్తు త్యాగంతో పోల్చి చూపించారు గోల్డింగ్.

అయితే ఈ నవల ముఖ్య ఉద్దేశం అంతిమ తీర్పుగా కనపడిన అలాంటి తీర్పేదైనా వచ్చిందా అంటే ఖచిఛితంగా రాలేదని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరూ శిక్షింపబడలేదు, ఎవరూ హర్షించబడలేదు. ఈ నవల ఒక్క తీర్పుకో, మంచితనానికో సంబంధించింది కాదు. నైతికాంశాల్లో అంతిమ తీర్పు పొందడం ఎంతో కష్టమని చెప్పడం మాత్రమే. అయితే ఇక్కడ మ్యాటీ ఆత్మగా, సోఫీ శరీరంగా వర్ణించడం జరిగింది. కానీ ఆధ్యాత్మికతలో ఉన్న నిజాన్ని ఖచ్ఛితత్వాన్ని ఖచ్ఛితంగా చెప్పలేం. ఇంకా ఆ ఆధ్యాత్మికతతో మ్యాటీకున్న సంబంధ్మేంటో కూడా చెప్పలేం. మ్యాటీకి అసాధ్యమైన డిమాండ్లను చేస్తున్న ఆత్మలో ఉన్న అసలైన అంశాన్ని కూడా చెప్పలేం.

కానీ, ఈ డార్క్నెస్ విజ్బుల్లో ఒక అందవికారమైన, ఎవరూ తాకడానికి కూడా ఇష్టపడని, అందరూ ధూషించే ఓ వ్యక్తి తనలోని అపారమైన ఆత్మవిశ్వాసంతో ఒక్కడే ఒంటరిగా దుర్మార్గానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో సాధించిన విజయం మానవుల ధైర్యానికి ఒక ఉత్సాహం, ఉల్లాసం, ప్రోత్సాహాలకు చిహ్నం.

No comments: